స్థానిక ప్రభుత్వ నిర్ణయాలకు ఎల్‌జీ కట్టుబడి ఉండాలి.. ఢిల్లీలో ‘అధికారం’పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు!

  • పాలనా వ్యవహారాలపై నియంత్రణ ఎవరికి ఉండాలనే దానిపై ఢిల్లీ సర్కారు, కేంద్రం మధ్య వివాదం
  • స్థానికంగా ఎన్నికైన ప్రభుత్వానికే అధికారాలుండాలన్న సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం
  • శాంతి భద్రతలు తప్ప మిగిలిన అంశాలపై ఢిల్లీ ప్రభుత్వానికే నియంత్రణ ఉండాలని ఉత్తర్వులు
దేశ రాజధాని ఢిల్లీలో పాలనా వ్యవహారాలపై నియంత్రణ అధికారం ఎవరికి ఉండాలనే వివాదంలో కేంద్రానికి ఎదురుదెబ్బ తగిలింది. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ ప్రభుత్వానికి పెద్ద ఊరట కలిగింది. స్థానికంగా ప్రజల ద్వారా ఎన్నికైన ప్రభుత్వానికే ఢిల్లీ పాలనా వ్యవహారాల్లో అసలైన అధికారాలు ఉండాలని సుప్రీంకోర్టు గురువారం సంచలన తీర్పు చెప్పింది. 

ఢిల్లీ సర్కారుకు అధికారాలు లేవన్న గత తీర్పును సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ప్రభుత్వాధికారులపై స్థానిక ప్రభుత్వానికే అధికారాలు ఉంటాయని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పునిచ్చింది. ఇదే సమయంలో ఢిల్లీలో ఎన్నికైన ప్రభుత్వ నిర్ణయాలకు లెఫ్టినెంట్‌ ‌గవర్నర్ (ఎల్‌జీ) కట్టుబడి ఉండాలని కూడా స్పష్టం చేసింది.

ప్రజల అభీష్టం ప్రతిబంబించేలా చట్టం చేసే అధికారాలు ఢిల్లీ అసెంబ్లీకి ఉన్నాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. "అధికారులు.. మంత్రులకు నివేదించడం ఆపివేస్తే లేదా వారి ఆదేశాలకు కట్టుబడి ఉండకపోతే, సమష్టి బాధ్యత సూత్రం ప్రభావితమవుతుంది’’ అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ చెప్పారు. శాంతి భద్రతలు మినహా మిగతా అన్ని అంశాలపై ఢిల్లీ ప్రభుత్వానికే నియంత్రణ ఉండాలని సుప్రీం తేల్చిచెప్పింది.

Supreme Court
Delhi Government
Centre
AAP
power of administration

More Telugu News